పెద్దగా మొరుగుతున్నదని ఏ కుక్కనీ మనుషులు చేరదీయరు,ఎక్కువగా మాట్లాడుతున్నాడని ఏ మనిషినీ విఘ్నులు గౌరవించరు

Sunday, 21 February 2016

‘ఎవరేం చేశారో లెక్క తేలుస్తా!’

  • జలవనరుల శాఖ అధికారులపై సీఎం సీరియస్‌
  • పని చేయని కాంట్రాక్టర్లు బ్లాక్‌ లిస్టులో : చంద్రబాబు

‘మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండేళ్లలో జలవనరుల శాఖకు భారీగా నిధులను కేటాయించాం. నా సమయంలో అధికశాతం ఈ శాఖకే కేటాయిస్తున్నా. కానీ అందుకు తగ్గట్టు పనులు జరగడం లేదు. మంత్రికి, కార్యదర్శికి కూడా ఇదే విషయం చెప్పా. ఇంత వరకు నేను మీకు సహకరించా. ఇకపై మీరు ప్రభుత్వానికి సహకరించాలి. పనులు చేయకుండా బ్లాక్‌మెయిల్‌ చేస్తామంటే నా స్పందన చాలా సీరియ్‌సగా ఉంటుంది’ అని సీఎం చంద్రబాబు జలవనరుల శాఖ అధికారులను హెచ్చరించారు. గత రెండు రోజులుగా జలవనరుల శాఖ పనితీరును, సాగునీటి ప్రాజెక్టు ప్రగతిని సమీక్షిస్తున్న సీఎం శనివారం ఇదే అంశంపై విలేకరుల సమావేశంలో మాట్లాడారు. అధికారులు, కాంట్రాక్టర్లు మొదలు మంత్రి, కార్యదర్శి వరకు అందరిపైనా అసహనం వ్యక్తం చేశారు. సందర్భానికి, లక్ష్యాలకు తగ్గట్టు సన్నద్ధం కావాలని జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, శాఖ కార్యదర్శి ఆదిత్యనాథ్‌దాస్‌కు సీఎం సూచించారు. పనులు చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించే కాంట్రాక్టర్లను బ్లాక్‌ లిస్టులో పెడతామని, బ్యాంకు గ్యారంటీలు నిలిపివేస్తామని హెచ్చరించారు. ప్రాజెక్టుల నిర్మాణానికి స్పష్టమైన కాలపరిమితిని నిర్దేశించిన సీఎం, ఆ ప్రకారం పనులు పూర్తి చేయకపోతే కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. జల వనరుల శాఖలో సూపర్‌వైజర్‌ నుంచి సీఈ వరకు ప్రతి ఒక్కరి పనితీరును మదిస్తున్నట్లు సీఎం తెలిపారు. గత 20 నెలల్లో ఎంత పని చేయాలి? ఏమేరకు చేశారు? అనే అంశాలను పరిగణనలోకి తీసుకుంటామన్నారు. పనితీరు ఆధారంగానే పోస్టింగ్స్‌, ఇంక్రిమెంట్లు ఇస్తామని స్పష్టం చేశారు. పనితీరు బాగా లేకుంటే చర్యలు తప్పవని హెచ్చరించారు. కాంట్రాక్టర్ల పనితీరునూ విశ్లేషిస్తామని సీఎం తెలిపారు. పని చేయని కాంట్రాక్టర్లకు నోటీసులు జారీ చేయాలని కోరారు. పని చేయని వారి బ్యాంకు గ్యారంటీలు నిలిపివేయండి, అవసరమైతే బ్లాక్‌ లిస్టులో పెట్టండని అధికారులను ఆదేశించారు.
 
అదనపు భారాన్ని తగ్గించుకునేందుకే.. 
‘పెండింగ్‌ ప్రాజెక్టులను మేం అధికారంలోకి వచ్చాక విశ్లేషించాం. పోలవరం, ఉత్తరాంధ్ర సుజల స్రవంతిని మినహాయిస్తే మిగిలిన ప్రాజెక్టుల్లో మేము వచ్చే సమయానికి ఇంకా రూ.11,229 కోట్ల విలువైన పనులు జరగాల్సి ఉంది. పెరిగిన ధరల ప్రకారం చూస్తే రూ.17,907 కోట్లు అవసరమవుతాయి. సుమారు 6వేల కోట్ల అంచనాలను సవరించడం ద్వారా పనులు పూర్తి చేయవచ్చు. పాత టెండర్లను రద్దు చేసి కొత్తగా టెండర్లు పిలిస్తే ఈ మొత్తం రూ. 24,705 కోట్లు అవుతుంది. అంటే, రూ.13,475 కోట్లు అదనం. అందుకే టెండర్లు రద్దు చేయకుండా పనులు కొనసాగిస్తున్నాం’ అని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. ‘జలవనరుల శాఖ సందర్భానికి...అవసరానికి తగ్గ విధంగా సన్నద్ధం కావాలి. ఇంకా 44,538 ఎకరాలు సేకరించాల్సి ఉంది. నేను ప్రాజెక్టుల వద్ద నిద్రించా. సమావేశాలు ఏర్పాటు చేశా. నేను చేయాల్సిందంతా చేశాను. ఇక జలవనరుల శాఖ అధికారులు, కాంట్రాక్టర్లు తమ సామర్థ్యాన్ని చూపించాల్సి ఉంది’ అని సీఎం పేర్కొన్నారు. ‘ప్రాజెక్టులపై ఇప్పటివరకు రూ.11,300 కోట్లు ఖర్చు చేశాం. వచ్చే మూడేళ్లలో మరో 15 నుంచి 20 వేల కోట్లు ఖర్చు చేస్తే ఈ ప్రాజెక్టులన్నీ పూర్తవుతాయి’ అని సీఎం వివరించారు. ప్రాజెక్టులవారీ నిర్మాణ లక్ష్యాలను సీఎం చంద్రబాబు వెల్లడించారు. పోలవరం కుడి కాల్వ నిర్మాణం ఈ ఏడాది జూన్‌నాటికి, ఎడమ కాల్వ నిర్మాణం 2017 జూన్‌నాటికి పూర్తి చేయాలని నిర్దేశించారు. 2018 నాటికి పోలవరం మొదటి దశ పూర్తి కావాలని సీఎం స్పష్టం చేశారు. వంశధార స్టేజ్‌-2ను 2017 జూన్‌ నాటికి, తోటపల్లి ప్రాజెక్టును ఈ ఏడాది జూలై నాటికి పూర్తి చేయాలని కోరారు. పట్టిసీమను వచ్చే మార్చిలోగా పూర్తి చేయాలని నిర్దేశించారు. వెలిగొండకు 2017 డిసెంబర్‌ను డెడ్‌లైన్‌గా నిర్ణయించారు. పట్టిసీమ ద్వారా గోదావరి నుంచి కృష్ణాకు ఈ ఏడాది 100టీఎంసీల జలాలను తీసుకొస్తామని సీఎం చంద్రబాబు తెలిపారు.

No comments:

Post a Comment