- భక్తి శ్రద్ధలతో యాగం
- హాజరైన ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలు
తుళ్ళూరు: రాజధాని శంకుస్థాపన ప్రదేశం ఉద్ధండ్రాయునిపాలెంలో గురువారం విష్ణు సహస్ర నామ పారాయణం భక్తిశ్రద్ధలతో జరిగింది. చినజీయరు స్వామి నిర్వహించిన ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, సభాపతి కోడెల శివప్రసాదరావు, మంత్రులు ప్రత్తిపాటి పుల్లారావు, నారాయణ, కొల్లు రవీంద్ర, దేవినేని ఉమా, మహిళా కమిషన్ చైర్మన్ నన్నపనేని రాజకుమారి, ఎంపీ గోకరాజు గంగరాజు, ఎమ్మెల్యే శ్రావణ్కుమార్, ఎంపీ రాయపాటి సాంబశివరావు, మాజీమంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్, ఆయన కుటుంబసభ్యులు కార్యక్రమానికి హాజరయ్యారు. ముఖ్యమంత్రి .. చినజీయర్ వద్ద ఆశీస్సులు తీసుకొని మంత్రాలను పఠించారు. మంత్రులు ఆయనతో పాటు కార్యక్రమంలో చివరివరకు ఉన్నారు. గురువారం భీష్మ ఏకాదశి రోజున వేలమంది విష్ణు సహస్ర నామాన్ని పారాయణం చేయడం సకల శుభాలకు నాంది అని చినజీయర్ తన ప్రవచనంలో తెలిపారు. అనంతరం చంద్రబాబుకు ప్రసాదం అందజేసి ఆశీర్వచనం ఇచ్చారు. వేలమంది భక్తులు పాల్గొన్న కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ మానవసంకల్పంతో పాటు దైవసంకల్పం ఉండాలని అన్నారు. రాజధాని నిర్మాణానికి దైవ సంకల్పం ఉందన్నారు. రాష్ట్రవిభజన తరువాత ఆలోచనలో పడిన తనకు, లాండు పూలింగ్ కార్యక్రమం అనేది దైవ సంకల్పంగా కలిగిన ఆలోచన అన్నారు. మన రాష్ట్రం 2050 నాటికి ప్రపంచంలోనే నెంబర్వన్ అవుతుందని ఆకాంక్షించారు. మంచి వాతావరణంలో దైవ కార్యక్రమం జరపటం చాలా సంతోషంగా ఉందని అందుకు స్వామీజీకి కృతజ్ఞతలు తెలుపుతున్నానని ముఖ్యమంత్రి అన్నారు.
No comments:
Post a Comment