- ఫ్రీడమ్251 మొబైల్ కోసం ఎగబడిన ఔత్సాహికులు
- మొబైల్ విక్రయించే సైట్ క్రాష్
- కొన్ని గంటల్లోనే అమ్మకాల నిలిపివేత
- మళ్లీ పునరుద్ధరిస్తామన్న కంపెనీ
న్యూఢిల్లీ : రింగింగ్ బెల్స్ కంపెనీ 251 రూపాయల ధరతో విడుదల చేసిన ఫ్రీడమ్ 251 స్మార్ట్ఫోన్ కొనుగోలు కోసం జనం తీవ్రస్థాయిలో పోటీపడ్డారు. శుక్రవారం ఉదయం ఆరు గంటల నుంచి ఈ ఫోన్ కొనుగోళ్లను ఫ్రీడమ్ 251 డాట్కామ్ వెబ్సైట్ ద్వారా ప్రారంభించారు. ఆరంభంలోనే సైట్కు కొనుగోళ్ల తాకిడి పెరిగిపోయింది. ఫలితంగా ఎన్ని సార్లు ఆర్డర్ చేసినా లావాదేవీ మాత్రం పూర్తికాలేదని చాలా మంది చెబుతున్నారు. వెబ్సైట్ ముందు పేజీలోనే ఈ ఫోన్ను కొనుగోలు చేసేందుకు ‘బై’ ఆప్షన్ను ఇచ్చారు. కొనుగోలుదారునికి సంబంధించిన పూర్తి వివరాలను ఎంటర్ చేసిన తర్వాత పేమెంట్ గేట్వే ద్వారా చెల్లింపులు చేయాల్సి ఉంటుంది. సమాచారం ఎన్నిసార్లు ఎంటర్ చేసినా పేమెంట్ మాత్రం జరగలేదని చాలా మంది నిరుత్సాహం వ్యక్తం చేస్తున్నారు. తక్కువ ధరలోనే ఈ ఫోన్ను కంపెనీ అందించడం వల్ల జనం ఎగబడిపోయారని, ఫలితంగానే ఈ సమస్య ఏర్పడినట్టు తెలుస్తోంది.
అయితే ఈస్థాయిలో డిమాండ్ ఉంటుందని కంపెనీ ముందే ఊహించి ఉండాలని, తగిన ఏర్పాటు చేసి ఉంటే బాగుండేదని కొంత మంది అంటున్నారు. కాగా ఓవర్లోడ్ కారణంగా ఆర్డర్ల స్వీకరణను కొన్ని గంటల్లోనే రింగింగ్ బెల్స్ నిలిపివేసింది. అసౌకర్యానికి క్షమాపణ కోరింది. 24 గంటల తర్వాత కొనుగోళ్ల ప్రక్రియను పునరుద్ధరించనున్నట్టు వెబ్సైట్ ద్వారా వెల్లడించింది. తాము ఊహించిన దానికి మించి కస్టమర్ల నుంచి స్పంద న వచ్చినట్టు కంపెనీ పేర్కొంది. సెకనుకు ఆరు లక్షల హిట్స్ వచ్చాయని, ఫలితంగా సర్వర్లు ఓవర్ లోడ్ అయినట్టు తెలిపింది. ఈ నేపథ్యంలోనే కొనుగోళ్ల ప్రక్రియను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్టు పేర్కొంది.
రూ.250 కోట్లతో ప్లాంట్లు
251 రూపాయలకే స్మార్ట్ఫోన్ను విడుదల చేయడం పట్ల పరిశ్రమవర్గాల్లో తీవ్ర స్థాయి ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ ఫోన్ వెనుకున్న మతలు ఏమిటబ్బా అన్న అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. కంపెనీ ప్రచారం కోసమే ఇలాంటి మొబైల్ను తీసుకువచ్చినట్టు కూడా కొంత మంది అంటున్నారు. మార్కెటింగ్లో ఇదో కొత్త పంథా అని కూడా చెబుతున్నారు. ప్రభుత్వం నుంచి సబ్సిడీ అందుతుందేమోనని కూడా అంటు న్నారు. అయితే దీనిపై రింగింగ్ బెల్స్ ప్రెసిడెంట్ అశోక్ చద్దా స్పందించారు. ప్రభుత్వం నుంచి ఎలాంటి సబ్సిడీని తాము తీసుకోవడం లేదన్నారు. ఈ ఫోన్ తయారీ వ్యయం 2,500 రూపాయలని, ఉత్పత్తిని భారీ స్థాయిలో పెంచడం, మార్కెటింగ్లో వినూత్నత, సుంకాల తగ్గింపు, ఇ-కామర్స్ మార్కెట్ ప్లేస్ ఏర్పాటు వంటి వాటి వల్ల వ్యయాలను రికవరీ చేసుకునే అవకాశం ఉందని చెప్పా రు. మేడ్ ఇన్ ఇండియా కాంపోనెంట్స్ ద్వారా సుంకాన్ని 13.8 శాతం మేర ఆదా చేసుకోగలుగుతున్నట్టు తెలిపారు. ఆన్లైన్లో అమ్మడం ద్వారా చాలా వరకు డిస్ర్టిబ్యూషన్ నెట్వర్క్ వ్యయాలు కలిపివస్తాయని చెప్పారు. నోయిడా, ఉత్తరాంచల్ ప్లాంట్లలో ఈ ఫోన్ను తయారు చేయనున్నామని, రెండు ప్లాంట్ల కోసం 250 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తామని తెలిపారు. ఒక్కో ప్లాంట్ ఉత్పత్తి సామర్థ్యం ఐదు లక్షల ఫోన్లుగా ఉంటుందని చెప్పారు. డెట్, ఈక్విటీ రూపంలో సొమ్మును సమకూర్చుకుంటామని తెలిపారు. పోటీ కంపెనీ ఫోన్కే రీబ్రాండింగ్ ?
రింగింగ్ బెల్స్ విడుదల చేసిన ఫ్రీడమ్ 251 మొబైల్పై ఆరోపణలు గుప్పుమంటున్నాయి. ఈ కంపెనీ పోటీ కంపెనీ యాడ్కామ్కు చెందిన ఐకాన్ 4 మొబైల్ను పోలి ఉన్నట్టు విశ్లేషకులు ఆరోపిస్తున్నారు. ఈ ఫోన్నే రింగిం గ్ బెల్స్ రీబ్రాండ్ చేసినట్టు చెబుతున్నారు. యాడ్కామ్ పేరు కనబడకుండా వైట్నర్ రాసిన మొబైల్స్ సోషల్ మీడియా సైట్లలో షికారు చేస్తున్నాయి. ప్రస్తుతం యాడ్కామ్ ఐకాన్ 4 మొబైల్ మార్కెట్లో అందుబాటులో ఉంది. దీని ధర 3,999 రూపాయలు. కాగా ఫ్రీడమ్ 251 మొబైల్లోని యాప్ ఐకాన్లు యాపిల్ ఐఫోన్లో ఉన్న మాదిరిగా ఉండటం కూడా చర్చనీయాంశంగా మారింది. కాగా తాజా వ్యవహారంపై యాడ్కామ్ వ్యవస్థాపక చైర్మన్ సంజీవ్ భాటియా మాట్లాడుతూ.. రింగింగ్ బెల్స్ తమ వద్ద నుంచి కొన్ని ఫోన్లను తీసుకుందని చెప్పారు. అయితే ఈ అంశంపై తాను ఇంకా మాట్లాడదలచుకోలేదని అన్నారు. కాగా తాము శాంపిల్ మోడల్స్ను మాత్రమే బుధవారంనాడు విడుదల చేశామని రింగింగ్ బెల్స్ ఎగ్జిక్యూటివ్ పేర్కొన్నారు. ఇప్పటికే ఫ్రీడమ్ 251పై భారత సెల్యులార్ అసోసియేషన్ అనుమానాలు వ్యక్తం చేసింది. ఇప్పుడు మరో కంపెనీ ఫోన్నే రింగింగ్ బెల్స్ రీ బ్రాండ్ చేసినట్టుగా అరోపణలు వస్తున్నాయి.
No comments:
Post a Comment