హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి బిజినెస్) : సెప్టెంబర్ త్రైమాసికంలో జివికె పవర్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ నష్టాలు తగ్గుముఖం పట్టాయి. విద్యుత్, విమానాశ్రయ విభాగాల నుంచి రాబడులు గణనీయంగా పెరగటంతో సెప్టెంబర్ త్రైమాసికంలో కన్సాలిడేటెడ్ నికర నష్టాలు 235.57 కోట్ల రూపాయల నుంచి 123.50 కోట్ల రూపాయలకు తగ్గాయి. సమీక్షా కాలంలో కన్సాలిడేటెడ్ రాబడులు 698.76 కోట్ల రూపాయల నుంచి 1,068.32 కోట్ల రూపాయలకు పెరిగినట్లు కంపెనీ పేర్కొంది.
ఈ కాలంలో ఆంధ్రప్రదేశ్లోని జేగురుపాడు మొదటి, రెండు దశలు, గౌతమి పవర్ ప్లాంట్కు పరిమిత స్థాయిలో సహజ వాయువు సరఫరాలను చేయటంతో ఇవి పూర్తి స్థాయిలో కార్యకలాపాలు సాగించకపోవటంతో పాటు వడ్డీ వ్యయాలు గరిష్ఠ స్థాయిలకు చేరుకోవటం పనితీరుపై ప్రభావం చూపించిందని జివికె పవర్ వెల్లడించింది. ఈ కాలంలో కంపెనీ వడ్డీ వ్యయాలు 266.22 కోట్ల రూపాయల నుంచి 504.22 కోట్ల రూపాయలకు పెరిగాయి. త్రైమాసిక కాలంలో ఇబిఐడిటిఎ ఏకంగా 89.4 శాతం వృద్ధితో 266.22 కోట్ల రూపాయల నుంచి 504.22 కోట్ల రూపాయలకు పెరిగిందని పేర్కొంది.
త్రైమాసిక కాలంలో ముంబై అంతర్జాతీయ విమానాశ్రయం (ఎంఐఎఎల్) రికార్డు స్థాయిలో 636.17 కోట్ల రూపాయల రాబడులను ఆర్జించిందని జివికె తెలిపింది. గత ఏడాది ఇదే కాలంలో రాబడులు 580.67 కోట్ల రూపాయలుగా ఉన్నాయి. రాబడులు పెరగటంతో ఎంఐఎఎల్ నికర నష్టాలు ఏకంగా 68.87 కోట్ల రూపాయల నుంచి 11.53 కోట్ల రూపాయలకు పడిపోయాయి. మరోవైపు బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయం (బిఐఎఎల్) రాబడులు కూడా 234.36 కోట్ల రూపాయల నుంచి 278.40 కోట్ల రూపాయలకు పెరిగాయి. బాలిలోని పిటి జివికె సర్వీసెస్ రాబడులు 25.59 కోట్ల రూపాయలుగా నమోదయ్యాయి.
త్రైమాసిక కాలంలో జివికె ఎనర్జీ డివిజన్ రాబడులు 32.08 కోట్ల రూపాయల నుంచి 311.19 కోట్ల రూపాయలకు దూసుకుపోయాయి. అలకానంద హైడ్రో పవర్ కంపెనీ వాణిజ్యపరమైన కార్యకలాపాలను ప్రారంభించటంతో పనితీరు మెరుగుపడిందని పేర్కొంది. అంతేకాకుండా ఎనర్జీ విభాగం నష్టాలు కూడా 59.18 కోట్ల రూపాయల నుంచి 32.42 కోట్ల రూపాయలకు తగ్గినట్లు జివికె తెలిపింది. కేజీ బేసిన్ నుంచి గ్యాస్ సరఫరాలను నిలిపివేయటంతో 684 మెగావాట్ల సామర్థ్యం గల గ్యాస్ ఆధారిత విద్యుత ప్లాంట్లు కార్యకలాపాలు సాగించలేకపోయాయని పేర్కొంది. మంగళవారం బిఎ్సఇలో కంపెనీ షేరు 2.64 శాతం లాభంతో 7.78 రూపాయల వద్ద స్థిరపడింది
No comments:
Post a Comment