పెద్దగా మొరుగుతున్నదని ఏ కుక్కనీ మనుషులు చేరదీయరు,ఎక్కువగా మాట్లాడుతున్నాడని ఏ మనిషినీ విఘ్నులు గౌరవించరు

Monday, 9 November 2015

బౌలింగ్‌ ఓకే.. మరి బ్యాటింగ్‌?

మొహాలీలో ప్రపంచ నెంబర్‌వన్ జట్టును ఓడించిన భారత సిరీస్‌లో ఆధిక్యం సాధించింది. స్వదేశంలో భారతకిది వరుసగా నాలుగో టెస్టు విజయం. అలాగే కెప్టెన్‌గా కోహ్లీకి సొంతగడ్డపై తొలి విజయం. శ్రీలంక పర్యటనలో రెండు వరుస విజయాల తర్వాత దక్కిన హ్యాట్రిక్‌ గెలుపు. ఇక వ్యూహాల పరంగానూ ఈ మ్యాచ్‌లో భారతదే పైచేయి. ఐదుగురు బౌలర్లు, ముగ్గురు స్పిన్నర్ల వ్యూహం భలేగా పనిచేసింది. ఇది కచ్చితంగా బౌలర్ల విజయమే! మరి బ్యాట్స్‌మెన్ పరిస్థితేమిటి..! 200 పరుగులు చేయడానికి మన బ్యాట్స్‌మెన్ ఆపసోపాలు పడ్డారు. ముఖ్యంగా రెండో ఇన్నింగ్స్‌లో 161/2తో పటిష్ట స్థితి నుంచి 39 పరుగుల తేడాతో మిగిలిన 8 వికెట్లు కోల్పోవడం ఆందోళన కలిగించే అంశం. తొలి టెస్టులో అశ్విన్, జడేజా రాణించడంతో బ్యాట్స్‌మెన వైఫల్యం మరుగున పడిపోయింది కానీ.. మిగిలిన సిరీస్‌లో ఇదే భారతను దెబ్బతీయొచ్చు..!
 
బౌలింగ్‌ వైఫల్యం కారణంగా టీ-20, వన్డే సిరీస్‌లు చేజార్చుకున్న భారత్.. టెస్టు సిరీస్‌లో మాత్రం విజయంతో బోణీ కొట్టింది. ప్రపంచ నెంబర్‌వన్ టెస్ట్‌ టీమ్‌ దక్షిణాఫ్రికాతో జరిగిన నాలుగు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో నిలిచింది. పరిమిత ఓవర్ల క్రికెట్‌లో తేలిపోయిన మన బౌలింగ్‌ విభాగం.. టెస్టుల్లో అద్భుతంగా పుంజుకుంది. ముగ్గురు స్పిన్నర్ల వ్యూహం ఫలితాన్నిచ్చింది. ఈ మ్యాచ్‌లో భారత్‌కు లభించిన 20 వికెట్లలో 19 స్పిన్నర్లకు దక్కడమే ఇందుకు నిదర్శనం! అశ్విన్, జడేజా చెరో 8 వికెట్లు పడగొడితే అమిత్ మిశ్రా మూడు వికెట్లు దక్కించుకున్నాడు. మిగిలిన సిరీస్‌లోనూ మన స్పిన్నర్ల జోరు ఇలాగే కొనసాగితే క్లీన్ స్వీప్‌ చేసినా ఆశ్చర్యం లేదు..!
 
జడేజా రీ ఎంట్రీ సూపర్‌
సిరీస్‌లో ఆధిక్యం సాధించడం భారతకు సానుకూలాంశం. ఈ విజయంలో కీలకపాత్ర రీ ఎంట్రీ హీరో రవీంద్ర జడేజాదే! 2014 ఆగస్టు తర్వాత అతనాడిన తొలి టెస్టు మ్యాచ్ ఇదే. ‘పేరుకే ఆల్‌రౌండర్‌.. వికెట్లు పడగొట్టింది లేదు.. బ్యాటింగ్‌లో రాణించింది లేదు’ అన్న కారణంగా అతడిపై వేటు పడింది. అయితే ఈ సౌరాష్ట్ర ఆల్‌రౌండర్‌ తనపై వచ్చిన విమర్శలకు ఆటతోనే సమాధానం చెప్పాడు. సఫారీలతో తొలి టెస్టులో జడేజా 8 వికెట్లతో రాణించాడు. తొలి ఇన్నింగ్స్‌లో అతడు 38 పరుగులు సాధించబట్టే జట్టు స్కోరు 200 దాటింది. స్వల్ప లక్ష్యాన్ని కాపాడుకునే క్రమంలో జడేజా ఐదు వికెట్లు పడగొట్టి పునరాగమనం మ్యాచలోనే ‘మ్యాన్ ఆఫ్‌ ద మ్యాచ్’ అందుకున్నాడు. ఇక జడేజా రికార్డును పరిశీలిస్తే స్వదేశంలో అతనాడిన ఆరు టెస్టుల్లో 35 వికెట్లు పడగొట్టాడు. అందులో 15 వికెట్లు చివరి రెండు మ్యాచల్లో సాధించినవే కావడం విశేషం. విదేశాల్లో ఎదురయ్యే పేస్‌ వికెట్లపై అతని ప్రదర్శన నిరాశ కలిగించిన మాట వాస్తవమే. కానీ, స్పిన్ పిచలపై జడేజా అమోఘంగా రాణించాడు. బౌలింగ్‌లో కచ్చితత్వం, నియంత్రణ, వేగమే అతని ప్రధాన బలం. ఫీల్డింగ్‌లోనూ జడ్డూ సూపర్‌! ఇక లోయర్‌ మిడిలార్డర్‌లో పరుగులు సాధించగల సత్తా అతనిలో ఉంది. మొహాలీ టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో సాధించిన 38 రన్స్, 2013లో ఆస్ర్టేలియాతో ఢిల్లీలో జరిగిన టెస్టులో 49 బంతుల్లో 43 పరుగుల ఇన్నింగ్స్‌ కూడా ఈ కోవలోకే వస్తాయి.
 
మరి బ్యాటింగ్‌ సంగతేమిటి..?: ఒత్తిడిలో ఉన్న భారత శిబిరంలో మొహాలీ టెస్టు ఫలితం ఉత్సాహాన్నిచ్చింది. బౌలింగ్‌ విభాగం ముఖ్యంగా స్పిన్నర్లు పుంజుకోవడం శుభపరిణామం. అయితే ఇన్ని సానుకూలతలు భారత బ్యాటింగ్‌ వైఫల్యాన్ని కప్పి పుచ్చలేవు..! తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో 201కే ఆలౌటైన భారత రెండో ఇన్నింగ్స్‌లో 161/2తో పటిష్ట స్థితిలో ఉన్నప్పటికీ 39 పరుగుల తేడాతో 8 వికెట్లు కోల్పోయింది. మురళీ విజయ్‌, చటేశ్వర్‌ పుజారా మాత్రమే రాణించారు. మిగిలిన బ్యాట్స్‌మెన్ ఘోరంగా విఫలమయ్యారు. ముఖ్యంగా ఓపెనర్‌ శిఖర్‌ ధవన్ ప్రదర్శన ఆందోళన కలిగిస్తోంది. రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ అతను డక్‌ అవుటయ్యాడు. కెప్టెన్ విరాట్‌ కోహ్లీ, అజింక్యా రహానె కూడా ఆకట్టుకోలేకపోయారు. స్వల్ప లక్ష్య ఛేదనలో సఫారీలు 109 పరుగులకే చేతులెత్తేశారు కాబట్టి బ్యాటింగ్‌ వైఫల్యం పెద్దగా ప్రస్తావనకు రాలేదు. కానీ, దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్‌లో ఒకట్రెండు భారీ భాగస్వామ్యాలు నమోదై ఉంటే 218 పరుగుల లక్ష్యం చిన్నబోయేదే..! కాబట్టి ఇది భారతకు గుణపాఠం కావాలి. మిగిలిన సిరీస్‌లోనైనా బ్యాట్స్‌మెన్ రాణించాల్సి ఉంది. అవసరమైతే ఒక పేసర్‌ను తప్పించి ఫామ్‌లో ఉన్న రోహితను ఆడిస్తే బ్యాటింగ్‌ విభాగం బలోపేతమవుతుంది. రెండో టెస్టు నుంచి ఇషాంత్ శర్మ అందుబాటులో కాబట్టి అతనికి తోడు ముగ్గురు స్పిన్నర్లతో బరిలోకి దిగినా సరిపోతుంది..!

No comments:

Post a Comment