- ఇదీ బీజేపీ పరిస్థితి
- పార్టీగా ఓకే.. కూటమిగా ఢమాల్
- బిహార్ ఓట్లాటలో వైచిత్రి
బిహార్ బరిలో మహా కూటమి సీట్లపరంగానే కాకుండా ఓట్లపరంగానూ సత్తా చాటింది. బీజేపీ నేతృత్వంలోని ఎనడీఏ కంటే పది శాతానికిపైగా అధికంగా ఓట్లు సాధించి ఓట్లాటలోనూ తనదే పైచేయి అని నిరూపించుకుంది. 2010 ఎన్నికలతో పోలిస్తే మహా కూటమిలోని పార్టీలన్నీ తమ ఓట్ల శాతాన్ని కొంత మేర కోల్పోయినప్పటికీ ఎన్డీఏపై తిరుగులేని ఆధిపత్యం ప్రదర్శించగలగడం విశేషం. ఎన్డీఏ కూటమిలో బీజేపీ తన వ్యక్తిగత ఓట్ల శాతాన్ని గణనీయంగా పెంచుకోగలిగినప్పటికీ ఆ ఓట్లను సీట్ల రూపంలోకి మార్చు కోవడంలో విఫల మైంది. ఓట్లు, సీట్ల లెక్కలోని కొన్ని ఆసక్తికర అంశాలివీ..
- గత ఎన్నికల కంటే బీజేపీ ఓట్లు దాదాపు 8 శాతం మేర పెరిగాయి. కానీ సీట్లు గణనీయంగా తగ్గిపోయాయి.
- ఆర్జేడీ ఓట్ల శాతంలో గతానికీ, ఇప్పటికీ తేడా స్వల్పంగానే ఉన్నప్పటికీ, జేడీ(యూ) ఓట్ల శాతం దాదాపు 6 శాతం మేర పడిపోయింది. గత ఎన్నికల్లో బీజేపీతో కలిసి బరిలో దిగిన జేడీ(యూ) సీట్ల పరంగా చూసినప్పుడు గణనీయంగా సీట్లను కోల్పోయింది. అయితే కొత్త కూటమిలో భాగంగా, మిత్రపక్ష ఆర్జేడీకి గణనీయంగా సీట్లు కేటాయించి, తాను వ్యక్తిగతంగా కోల్పోయిన దానికంటే జట్టుగా సాధించిన విజయమే దానికి కీలకమని చెప్పాలి.
- మహా కూటమిలోని కాంగ్రెస్ గతం కంటే ఒకటిన్నర శాతానికిపైగా ఓట్లను కోల్పోయినప్పటికీ కలిసొచ్చిన కూటమిలో ఉండి, సీట్లపరంగా భారీ లబ్ధి పొందింది. అదే ఎనడీఏ పక్షంలోని లోక్జనశక్తి, హెచఏఎంస్లు పెద్దగా సాధించిందేమీ లేకపోవడం ఎనడీఏకి పెద్ద మైనస్.
- ఇక మహా కూటమిలో చేరినట్లే చేరి, అలక బూనిన ములాయం సింగ్ యాదవ్ నేతృత్వంలోని సమాజ్వాదీ పార్టీ (ఎస్పీ)కి దక్కింది ఒకే ఒక్క శాతం ఓట్లు. దానికి దక్కిన సీట్లు సున్నా.
- తొలిసారి బిహార్ బరిలో తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమైన మజ్లిస్ పార్టీ 0.2 శాతం ఓట్లతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. దానికి బోణీ కొట్టే అవకాశం దక్కలేదు.
- ఈ ఎన్నికల్లో ఘోర పరాజయం చవిచూసినా, ఓట్ల శాతం పరంగా అన్ని పార్టీల కంటే అగ్ర స్థానంలో నిలవడం ఒక్కటే బీజేపీకి దక్కిన పెద్ద ఊరటగా చెప్పుకోవచ్చు.
No comments:
Post a Comment