పెద్దగా మొరుగుతున్నదని ఏ కుక్కనీ మనుషులు చేరదీయరు,ఎక్కువగా మాట్లాడుతున్నాడని ఏ మనిషినీ విఘ్నులు గౌరవించరు

Tuesday, 23 February 2016

ధనాధన్ ఆసియా

  • రేపటి నుంచే ఆసియా కప్‌
  • టైటిల్‌ ఫేవరెట్‌గా భారత్
  • 27న ఇండో-పాక్‌ మ్యాచ్‌క్రికెట్ అభిమానులను అలరించేందుకు ఆసియాకప్‌ ముస్తాబైంది. టీ-20 వరల్డ్‌క్‌పనకు సమయం దగ్గరపడుతున్న నేపథ్యంలో దానికి సన్నాహకం అన్నట్టుగా ధనాధన్‌ షాట్లతో ఉర్రూతలూగించేందుకు సర్వం సిద్ధం చేసుకుంది. 1984లో వన్డే ఫార్మాట్‌గా మొదలై రెండేళ్లకోసారి ఆసియాతోపాటు యావత ప్రపంచానికి వినోదాన్ని పంచుతున్న ఈ మెగా టోర్నీ తొలిసారి పొట్టి ఫార్మాట్‌లో గిలిగింతలు పెట్టనుంది. బంగ్లాదేశ్‌ వేదికగా జరిగే ఈ టోర్నీ విశేషాలపై ఓ లుక్కేద్దామా..! 

    మిర్పూర్‌: క్రికెట్‌లో మరో ఆసక్తికర పోరుకు తెరలేవనుంది. ఐదు దేశాలు.. 12 రోజులపాటు.. టైటిల్‌ కోసం సర్వశక్తులూ ఒడ్డేందుకు అస్త్రశస్ర్తాలను సిద్ధం చేసుకుంటున్నాయి. బుధవారం మొదలయ్యే ఆసి యా కప్‌లో టైటిల్‌ కోసం అమీతుమీకి సిద్ధమయ్యాయి. తొలిసారిగా టీ-20 ఫార్మాట్‌లో జరగనున్న ఈ ఆసియా కప్‌లో ఐదుసార్లు చాంపియన్‌ భారత మరోసారి హాట్‌ ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది. శ్రీలంక, పాకిస్థాన్‌ గట్టి పోటీనిచ్చేందుకు సిద్ధంగా ఉన్నాయి. ఇక ఈ టోర్నీకి ఆతిథ్యమిస్తు న్న బంగ్లాదేశ్‌తోపాటు యుఏఈ కూడా అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. ఆతిథ్య బంగ్లాదేశ్‌, భారత జట్ల మధ్య బుధవారం జరిగే పోరుతో ఈ మెగా ఈవెంట్‌ ఆరంభం కానుంది. అలాగే ఈ నెల 27న భారత్, పాకిస్థాన్‌ మధ్య జరిగే దాయాదుల సమరం కూడా ఈ టోర్నీకి ప్రధాన ఆకర్షణ కానుంది.
     
    టీ-20 ఫార్మాట్‌లో ఎందుకంటే.. 
    ఆసియా కప్‌ నిర్వహణ విషయంలో ఆసియా క్రికెట్‌ కౌన్సిల్‌ (ఏసీసీ) కీలక నిర్ణయం తీసుకుంది. వన్డే వరల్డ్‌క్‌పనకు ముందు 50 ఓవర్ల ఫార్మాట్‌లో, టీ-20 ప్రపంచక్‌పనకు ముందు పొట్టి ఫార్మాట్‌లో ఈ ఆసియా కప్‌ను నిర్వహించాలని నిర్ణయించింది. దాన్ని ఈ ఏడాది నుంచే అమలు చేస్తోంది. అంటే 2019లో వన్డే ప్రపంచకప్‌ ఉంటుంది కాబట్టి.. 2018లో జరిగే ఆసియాకప్‌ వన్డే ఫార్మాట్‌లో జరుగుతుంది.
     
    ఆసియా కప్‌ చరిత్ర 
    ఈ మెగా టోర్నీ మొదలై 32 ఏళ్లయింది. ఇప్పటి వరకు 13 టోర్నీలు జరిగాయి. ఇది 14వ అంచె. ఇక ఆసియా కప్‌నకు బంగ్లాదేశ్‌ ఆతిథ్యమివ్వడం ఇది ఐదోసారి. ఈ టోర్నీలో భారత, శ్రీలంక జట్లు అత్యధికంగా చెరో ఐదుసార్లు విజేతగా నిలిచాయి. పాకిస్థాన్‌ రెండు సార్లు ట్రోఫీ నెగ్గింది. బంగ్లాదేశ్‌ ఒక్కసారి కూడా చాంపియన్‌గా నిలవలేకపోయింది. కాగా.. 1993లో పాకిస్థాన్‌ వేదికగా జరగాల్సిన టోర్నీ అనివార్య కారణాల వల్ల రద్దయింది.
     
    టోర్నీ సాగుతుందిలా.. 
    ఈ మెగా టోర్నీ రెండు దశల్లో జరగనుంది. మొదట క్వాలిఫికేషన్‌ రౌం డ్‌, ఆ తర్వాత మెయిన్‌ రౌండ్‌ ఉంటుంది. తొలి అంచెలో ఐసీసీ అనుబంధ దేశాలైన అఫ్ఘానిస్థాన్‌, యూఏఈ, ఒమన్‌, హాంకాంగ్‌ అర్హత రౌం డ్‌లో (19 నుంచి 22 వరకు) పాల్గొన్నాయి. నాలుగు జట్లూ మిగ తా ప్రత్యర్థులతో ఒక్కోసారి పోటీపడ్డాయి. అగ్రస్థానంలో నిలిచిన యూఏఈ జట్టు మెయిన్‌ డ్రాకు అర్హత సాధించింది. 24 నుంచి మార్చి ఆరు వరకు జరిగే మెయిన్‌ డ్రాలో భారత్, పాకిస్థాన్‌, శ్రీలంక, బంగ్లాదేశ్‌తో పాటు క్వాలిఫయర్‌ జట్టు యూఏఈ టైటిల్‌ కోసం పోటీ పడుతుంది. రౌండ్‌ రాబిన్‌ దశలో ఒక్కో జట్టు మిగిలిన టీమ్‌లతో ఒక్కోసారి తలపడుతుంది. పట్టికలో తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్ల మధ్య మార్చి ఆరో తేదీన ఫైనల్‌ మ్యాచ్‌ జరుగుతుంది.

    వేదిక: అన్ని మ్యాచ్‌లకూ మిర్పూర్‌లోని షేర్‌-ఎ-బంగ్లా జాతీయ క్రికెట్‌ స్టేడియం ఆతిథ్యం ఇస్తోంది.
     
     దాయాదుల పోరు 27న
    ఈ ఆసియా కప్‌లో మిగిలిన మ్యాచ్‌ల సంగతెలా ఉన్నా.. ఈనెల 27న భారత-పాకిస్థాన్‌ మధ్య జరిగే మ్యాచ్‌ కోసం ఇరు దేశాల అభిమానులతోపాటు యావత ప్రపంచం ఆసక్తిగా ఎదురు చూస్తోంది. గతేడాది డిసెంబర్‌లో ఇండో-పాక్‌ ద్వైపాక్షిక సిరీస్‌ ఉంటుందని భావించినా.. అది కుదర్లేదు. ఈ రెండు దేశాలు చివరిగా 2015 వన్డే వరల్డ్‌క్‌పలో తలపడ్డాయి. ప్రపంచకప్‌ చరిత్రలో పాక్‌పై అజేయమైన రికార్డున్న భారతనే ఆ మ్యాచ్‌లో విజయం వరించింది. ఆ తర్వాత ఈ రెండు జట్లూ ఇంతవరకూ తలపడలేదు. ఇప్పుడు ఆసియా కప్‌ రూపంలో మరోసారి ఆ చాన్స్‌ వచ్చింది. కాబట్టి ఈ హై ఓల్టేజ్‌ మ్యాచ్‌పై అంచనాలు భారీ స్థాయిలో ఉన్నాయి.

No comments:

Post a Comment