- బిహార్ ఎన్నికల ఫలితాల ప్రభావం..
- కొనుగోళ్లకు అవకాశమంటున్న నిపుణులు..
- అప్రమత్తమైన సెబి, స్టాక్ ఎక్స్ఛేంజ్లు
బిహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఈ వారం స్టాక్ మార్కెట్ను భారీగా ప్రభావి తం చేసే అవకాశం ఉంది. హోరాహోరీగా సాగిన ఈ పోరులో ఎన్డిఎ స్వల్ప మెజారిటీ సాధించినా మార్కెట్లో దీపావళి జోష్ ఉంటుందని మార్కెట్ వర్గాలు భావించాయి. ఆ ఆశలన్నీ ఇపుడు అడియాశలయ్యాయి. దీంతో ఈ వారం మార్కెట్లో తీవ్ర ఆటు పోట్లు తప్పవని భావిస్తున్నారు. గత వారం ముగింపుతో పోలిస్తే ఈ వారం సెన్సెక్స్, నిఫ్టీ రెండు నుంచి రెండున్నర శాతం వరకు నష్టపోయే ప్రమాదం ఉందని మార్కెట్ వర్గాల అంచనా. కొంత మంది టెక్నికల్ విశ్లేషకులైతే నిఫ్టీ 7800 పాయింట్లకు కూడా దిగొచ్చే అవకాశం ఉందంటున్నారు. ‘దీపా వళికి ముందు వెలువడిన బిహార్ అసెంబ్లీ ఫలితాలు మార్కెట్ సెంటిమెంట్ను దెబ్బతీశాయి. గత వారమే మార్కెట్ దీన్ని ఊహించి నిఫ్టీ 8000 పాయిట్ల దిగువకు పడిపోయింది. సోమవారం మరిం త ఎక్కువగా స్పందించే అవకాశం ఉంది. అయితే వారాంతానికి మార్కెట్ మళ్లీ కోలుకోవచ్చు’ అని సెంట్రమ్ బ్రోకింగ్ సిఇఒ కె సందీప్ నాయక్ చెప్పారు. ‘బిహార్ ఎన్నికల ఫలితాలపై మార్కె ట్ ఎలా స్పందిస్తుందో సోమవారం ఉదయమే తెలిసిపోతుంది. రోజంతా ఆ ప్రభావమే మార్కెట్పై ఉంటుంది’ అని రెలిగేర్ సెక్యూరిటీస్ ప్రెసిడెంట్ జయంత మాంగ్లిక్ అన్నారు.
గత శుక్రవారం నిఫ్టీ 7,954.30 పాయింట్ల దగ్గర ముగిసింది. బిహార్ అసెంబ్లీ ఫలితాలతో సోమవారం నిఫ్టీ ప్రారంభంలోనే రెండు నుంచి రెండున్నర శాతం వరకు నష్టపోయే అవకాశం కనిపిస్తుంది. అయితే ట్రేడింగ్ ముగిసే సరికి నష్టాల నుంచి కోలుకుంటుందని కూడా కొంత మంది టెక్నికల్ ఎనలిస్టుల అంచనా. బిహార్లో పోటీ నువ్వానేనా అన్నట్టుందని ఎగ్జిట్ పోల్ ఫలితాలు ముందే చెప్పాయి. దాంతో గత వారం మార్కెట్ దాదాపు ఒక శాతం దిద్దుబాటుకు గురైంది. ఇపుడు ఫలితాలు పూర్తిగా వెలువడ్డాయి. దీంతో మార్కెట్లో ఈ వారమంతా ఆటు పోట్లు తప్పవని భావిస్తున్నారు.
ఈ దిద్దుబాటును మంచి కంపెనీల షేర్ల కొనుగోలుకు ఉపయోగించుకోవలని కూడా మార్కెట్ నిపుణులు సూచిస్తున్నారు. స్వల్ప కాలిక ఆటుపోట్లన పక్కన పెట్టి, దీర్ఘకాలిక సానుకూల అంశాలను పరిగణనలోకి తీసుకోవాలని చెబుతున్నారు. బిహార్ ఎన్నికల ఫలితాలపై స్పష్టత లేకపోవడంతో గత రెండు వారాలుగా, మిగత దేశాలతో పోలిస్తే భారత స్టాక్ మార్కెట్ కొంత వెనకబడింది. ఇపుడు పూర్తి స్పష్టత రావడంతో మార్కెట్ మళ్లీ త్వరలోనే గాడిలో పడుతుందని శామ్కో సెక్యూరిటీస్ సిఇఒ జిమీత మోదీ చెప్పారు. మంచి పోర్టుఫోలియో నిర్మించుకునేందుకు ఇలాంటి దిద్దుబాట్లు అద్భుతమైన అవకాశమని కూడా ఆయన స్పష్టం చే శారు. ఇక నుంచి మార్కెట్ గమనాన్ని దేశీయ అంశాల కంటే అంతర్జాతీయ ఆర్థిక పరిణామాలే ఎక్కువగా ప్రభావితం చేస్తాయని మార్కెట్ వర్గాల అంచనా.
బిహార్ ఎన్నికల ఫలితాలతో ఆర్థిక సంస్కరణలకు పెద్దగా ఢోకా ఉండదని కూడా మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. ప్రధాని మోదీ మ్యాజిక్ మసక బారుతోందన్న వాదనను సైతం ఈ వర్గాలు తోసిపుచ్చుతున్నాయి. కొన్ని ఇబ్బందులున్నా జిఎస్టి, భూసేకరణ బిల్లులకు ప్రభుత్వం ఏదో విధంగా ఆమోదం పొందుతుందని మార్కెట్ వర్గాల అంచనా.
బిహార్ ఎన్నికల ఫలితాలతో సెబి, స్టాక్ ఎక్స్ఛేంజ్లు సైతం అప్రమత్తమయ్యాయి. మార్కెట్ ఆటుపోట్లను అవకాశంగా చేసుకుని ఆపరేటర్లు ఎలాంటి అక్రమాలకు పాల్పడకుండా నిఘా పటిష్ఠం చేశారు. ఆదివారం, గత వారం ఆపరేటర్లు ప్లేస్ చేసిన ఆర్డర్లపైనా నిఘా తీవ్రం చేశారు. షేర్ల ధరల్లో ఎలాంటి అసాధారణ మార్పు కనిపించినా, సెబి నిబంధనలకు అనుగుణంగా వాటిని నియంత్రించే నిఘా, రిస్క్ మేనేజ్మెంట్ వ్యవస్థ తమకు ఉన్నాయని బిఎస్ఇ సిఇఒ అశిష్ కుమార్ చౌహాన ప్రకటించారు.
No comments:
Post a Comment