పెద్దగా మొరుగుతున్నదని ఏ కుక్కనీ మనుషులు చేరదీయరు,ఎక్కువగా మాట్లాడుతున్నాడని ఏ మనిషినీ విఘ్నులు గౌరవించరు

Wednesday, 24 February 2016

యు ముంబా జోరు


యు ముంబా జోరుడిఫెండింగ్ చాంపియన్ యు ముంబా ప్రొ కబడ్డీ లీగ్‌లో తమ జోరును కొనసాగిస్తోంది. లీగ్ ఆరంభంలో కాస్త తడబడ్డ యు ముంబా ఆ తర్వాత అద్భుత ఆటతీరుతో పుంజుకుంది. మంగళవారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో యు ముంబా 30-17 పాయింట్ల తేడాతో బెంగాల్ వారియర్స్‌ను ఓడించింది. తద్వారా ఈ లీగ్‌లో వరుసగా ఐదో విజయాన్ని, ఓవరాల్‌గా ఏడో విజయాన్ని తమ ఖాతాలో వేసుకుంది. మ్యాచ్ మొదలైన తొలి క్షణం నుంచే ముంబా జట్టు తమ పట్టు బిగించింది. ఆరంభంలోనే 4-0తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఆ తర్వాత ఇదే జోరును కొనసాగించి 10-2తో ముందంజ వేసి తమ ఆధిక్యాన్ని ఎనిమిది పాయింట్లకు పెంచుకుంది.

విరామ సమయానికి 17-6తో ఆధిక్యంలో ఉన్న ముంబా జట్టు చివరి నిమిషం వరకు తమ జోరును కొనసాగించి వారియర్స్‌కు తేరుకునే అవకాశం ఇవ్వలేదు. ముంబా జట్టులో రిషాంక్, ఫాజిల్ ఆరేసి పాయింట్లు సాధించగా... అనూప్ కుమార్ ఐదు పాయింట్లు సంపాదించాడు. బెంగాల్ జట్టులో జాంగ్ కున్ లీ ఒక్కడే కాస్త రాణించి నాలుగు పాయింట్లు స్కోరు చేశాడు.

పట్నా చేతిలో జైపూర్ చిత్తు

సొంత వేదికపై మ్యాచ్‌లను జైపూర్ పింక్ పాంథర్స్ హ్యాట్రిక్ పరాజయాలతో ముగించింది. మంగళవారం  జరిగిన మ్యాచ్‌లో పట్నా పైరేట్స్ 47-24 తేడాతో జైపూర్‌ను చిత్తుగా ఓడించింది. ఇక్కడ ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లో జైపూర్ ఒక్కటి మాత్రమే నెగ్గింది. లీగ్‌లో టేబుల్ టాపర్‌గా ఉన్న పట్నా ఆటగాళ్ల దూకుడుకు జైపూర్ బెంబేలెత్తింది. వీరి ఖాతా తెరవడానికి ముందే పట్నా 10 పాయింట్లు సాధించింది.

తొలి అర్ధభాగం 5-27తో వెనుకబడిన జైపూర్ చివర్లో కాస్త పుంజుకుంది. స్కోరు 9-42గా ఉన్న దశలో రాజేశ్ నర్వాల్ (10 పాయింట్లు) రాణించడంతో చివరకు ఓమాదిరి స్కోరైనా అందుకోగలిగింది. పట్నా నుంచి రోహిత్ కుమార్ 13 పాయింట్లు సాధించాడు.

No comments:

Post a Comment